సీఎమ్మార్ డెలివరీ పూర్తి చేయాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చెరువుల సంరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణతో కలిసి సమీక్షించారు. చెరువులు(వెట్ల్యాండ్స్) నీరు నిల్వ ఉండే భూములు ప్రకృతి సమతుల్యతకు కీలకమన్నారు. జిల్లాలో గుర్తించిన 164 చెరువులను అటవీ, నీటి పారుదల ఇతర శాఖల సమన్వయంతో సర్వే, మ్యాపింగ్, ఆన్లైన్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వాటి అభివృద్ధికి అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఆయా జల వనరుల అభివృద్ధితో వలస, స్థానిక పక్షులు, జంతువులకు ఉపయోగపడుతుందన్నారు.
భూముల రీసర్వేలో భాగస్వాములు కావాలి
జిల్లాలో భూముల రీసర్వేలో ఆయా శాఖల అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సర్వే కొనసాగుతుందని తెలిపారు. అటవీ, నీటి పారుదల, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖలకు చెందిన భూముల వివరాలు సర్వే అధికారులకు ఇవ్వాలని, సర్వేలో పాల్గొనాలని ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్బాబు, కేఎస్బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, నీటి పారుదల శాఖ అధికారి ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
సీఎమ్మార్ డెలివరీ పూర్తి చేయాలి
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. గత రెండు సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ పూర్తిచేయాలని, డిఫాల్టర్ మిల్లుల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీసీఎస్వో ఎల్.బుచ్చిబాబు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్ పాల్గొన్నారు.


