కోరుట్లరూరల్: మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు రమేశ్ (32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం రమేశ్ కొంతకాలం దుబాయ్ వెళ్లాడు. నెలరోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అప్పటినుంచి భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మద్యం సేవించి వచ్చిన రమేశ్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్కు ఇద్దరు పిల్లలున్నారు. తండ్రి అల్లెపు గంగారాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన కారు
● ముగ్గురికి స్వల్ప గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పీఆర్వో ప్రయాణిస్తున్న కారు సోమవారం ప్రమాదానికి గురైంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని సత్తెపీరీల దర్గా వద్ద చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వేములవాడ నుంచి కామారెడ్డి వెళ్తుండగా కారు అదుపుతప్పి మూలమలుపు వద్ద చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయ్యింది. క్షతగాత్రులను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.


