● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● సెప్టెంబర్ 26న ప్రారంభం
వేములవాడ: క్రీడలను ప్రోత్సహించడంతోపాటు గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా వేములవాడలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని త్రినేత్ర ఫంక్షన్హాల్ శనివారం వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు అండర్ 20 బాలుర, అండర్–16 బాలికల విభాగంలో నాలుగు రోజులపాటు కబడ్డీ పోటీలు జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలతోపాటు హైదరాబాద్ను రెండు జట్లుగా పరిగణించి మొత్తం 34 బాలుర, 34 బాలికల జట్లు పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. క్రీడాకారులు, అధికారులను కలుపుకొని 1358 మంది వస్తారన్నారు. యువత క్రీడల వైపు మళ్లేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీహరితోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబులను ఆహ్వానించినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కబడ్డి అసోసియేషన్ నాయకులు సంపత్రావు, బొడ్డు రాములు, మల్లారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


