పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గితే
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. వేములవాడ పరిధిలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా 800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం టౌన్ పోలీస్స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారులు, సిబ్బందికు పలు సూచనలు చేశారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో 17 రూట్ మొబైల్స్, 6 జోనల్ టీమ్స్, 4 రిజర్వ్ టీమ్స్, 2 స్ట్రయికింగ్ ఫోర్స్, 2 స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్ వినియోగిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద, రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న ఘటన ఎదురైనా వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో 163 బీఎన్ఎస్ఎస్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి, ఏఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


