ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలి
కోనరావుపేట: ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చకుండా అలాగే కొనసాగించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న దేశవ్యాప్త సమ్మెలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇక్కడ రమేశ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీవోకు సమ్మె నోటీసు అందజేత
వీర్నపల్లి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఈనెల చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా మండల గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీలేఖకు నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్మిక సంఘం అధ్యక్షుడు నర్సయ్య, కార్మికులు కమల్, శ్రీను, శేఖర్, రమేశ్, నరేశ్, మల్లేశం, ఎల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
కరపత్రం ఆవిష్కరణ
బోయినపల్లి: మండలకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఈనెల 12న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని రూపొందించిన కరపత్రాలను సీఐటీయూ నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులకు గుదిబండలా మారిన లేబర్ కోడ్లను రద్దు చేయడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రామంచ అశోక్, కార్మికులు లచ్చయ్య, అంజయ్య, శంకరవ్వ, రాములు పాల్గొన్నారు.


