పాలిసెట్తో ఉజ్వల భవిత
సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్టౌన్: ప్రస్తుతం పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన తల్లిదండ్రులు, విద్యార్థుల్లో మెదులుతుంది. చాలా మంది ఇంటర్ చదవడానికి ఆసక్తి చూపుతారు. సంప్రదాయ చదువులు కాకుండా.. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగవకాశాలు కావాలనుకునేవారికి పాల్టెక్నిక్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయని విద్యానిపుణులు చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాలిసెట్– 2026 ప్రవేశపరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థులకు అవకాశం
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 40,701 మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 13,156, జగిత్యాల 12,298, పెద్దపల్లి 7,495, రాజన్న సిరిసిల్ల 7,752 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో టెక్నికల్ రంగం వైపు అడుగులు వేయాలనుకునే వారు పాలిసెట్ను ఎంపిక చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాటారం, హుస్నాబాద్, సిరిసిల్ల(ఆగ్రహారం), కోరుట్ల, కరీంనగర్ జిల్లాకేంద్రాల్లో పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో 480 సీట్లు, హుస్నాబాద్, కాటారం, కోరుట్ల, కరీంనగర్ కళాశాలల్లో 5 కోర్సులకు 66 చొప్పున 330 సీట్లున్నాయి. ఆసక్తిగల విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.300 అపరాద రుసుముతో ఏప్రిల్ 22 వరకు ఫీజు చెల్లించొచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, పదో తరగతిలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా ఎంపిక చేస్తారు. మూడేళ్ల కోర్సులో ప్రతిభచాటిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా జెన్కో, ఎన్టీపీసీ, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే, సింగరేణి, ఐవోసీఎల్, బీహెచ్ఈఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నికల్ శిక్షకులుగా చేరవచ్చు.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఏప్రిల్ 20 వరకు అవకాశం.. మే 13న ప్రవేశ పరీక్ష
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,701 మంది ఎస్సెస్సీ విద్యార్థులు
ఉపాధి, ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి పాల్టెక్నిక్ విద్య తోడ్పడుతుంది. గ్రామీణ విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగకరం. తక్కువ ఫీజు చెల్లించి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. మూడేళ్ల కోర్సులో ఆరు నెలలు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఇది విద్యార్థుల్లో అవగాహన పెంచుతుంది. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేస్తే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు ఉంటాయి.
– డి.శోభారాణి,
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్
దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 20
రూ.100 అపరాధ రుసుంతో ఏప్రిల్ 21
ప్రవేశపరీక్ష నిర్వహించే తేదీ మే 13
పాలిసెట్తో ఉజ్వల భవిత


