నేతన్నల పొట్టకొట్టిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
సిరిసిల్ల: నేతన్నల పొట్టకొట్టిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు కోరారు. సిరిసిల్లలో గురువారం కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ నేతన్నలకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు రూ.3400 కోట్లతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. పద్మశాలీ భవన్కు ఐదెకరాల భూమిని కేటాయించి రూ.5కోట్లు ఇస్తే.. కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వకుండా.. పనిని మధ్యలో ఆపేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. రెండేళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
జిల్లాను రద్దు చేస్తారట
నాపై కోపంతో రేవంత్రెడ్డి జిల్లాను రద్దు చేస్తారట అని కేటీఆర్ అన్నారు. జిల్లాను రద్దు చేసే వాళ్లకు ఓట్లు వేద్దామా.. అని అడిగారు. సిరిసిల్లలో కొంతమేరకు అభివృద్ధి చేశానని, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న పెన్షన్లు, ఇళ్లు, రోడ్లు, మురికికాల్వలు పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల ఇన్చార్జి తుల ఉమ, కొండూరి రవీందర్రావు, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, శరత్రావు, అక్కరాజు శ్రీనివాస్, కుంభాల మల్లారెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ మాటలతో మోసపోకండి
సిరిసిల్లఅర్బన్: కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కేటీఆర్ కోరారు. జ్యోతినగర్, 11, 24వ వార్డుల్లో పర్యటించారు. కేటీఆర్ మాట్లాడుతూ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేశారన్నారు. జ్యోతినగర్ను దత్తత తీసుకొని వసతుల కల్పనకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.


