బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తా
● కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్
సిరిసిల్ల: మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని, సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను బీజేపీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. సిరిసిల్ల శివారులోని రగుడు వద్ద ఓ ఫంక్షన్హాల్లో బుధవారం బీజేపీ శ్రేణులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. బండి సంజయ్కుమార్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిందన్నారు. అభివృద్ధి విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు రెండు పట్టణాల్లో పాదయాత్ర చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టిక్కెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావులేదని, సర్వే రిపోర్టు ఆధారంగా గెలుపు గుర్రాలకే అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు. టిక్కెట్ల కోసం తనతోపాటు తన కుటుంబ సభ్యులకు ఫోన్లు కూడా చేయొద్దని, ఎవరైనా ఒత్తిడి తెస్తే వాళ్లకు వచ్చే టిక్కెట్లు కూడా రావని హెచ్చరించారు. టిక్కెట్లు రాకపోయినా పార్టీ పరంగా, నామినేటెడ్ పోస్టుల పరంగా న్యాయం చేస్తామన్నారు. హద్దు మీరి గొడవలు చేస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పార్టీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు, అల్లాడి రమేశ్, ఎర్రం మహేశ్, కుమ్మరి శంకర్, బోయినిపల్లి ప్రవీణ్రావు, బండ మల్లేశంయాదవ్, ఆడెపు రవీందర్, అన్నల్దాస్ వేణు, బర్కం లక్ష్మీనవీన్యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మ్యాన రాంప్రసాద్, కొక్కు దేవేందర్యాదవ్, గర్రి పెల్లి ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని శ్రీనగర్కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కలిసి వరద ముంపు, కచ్చకాల్వ, సీసీ రోడ్ల సమస్యలను వివరించారు.
వేములవాడలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
వేములవాడ: పట్టణంలోని ఓకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న నిర్వహించే రాష్ట్రస్థాయి కరాటే పోటీల బ్రోచర్ను ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. స్థానిక శ్రీనివాస్ ఫంక్షన్హాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మన్నాన్ తెలిపారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
రుద్రంగి(వేములవాడ): యువత డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఏఎస్పీ రుత్విక్సాయి సూచించారు. రుద్రంగి పోలీస్స్టేషన్ను బుధవారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే నేరాల నియంత్రనకు కృషి చేయాలని సూచించారు. వేడుకల పేరిట ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, రుద్రంగి ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు.
హన్మాజిపేటలో చిరుత సంచారం
వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజిపేట శివారులో చిరుతపులి సంచరించినట్లు ఫారెస్టు అధికారులు గుర్తించారు. రైస్మిల్ ప్రాంతంలో చిరుత అడుగులను గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా పోలీస్, ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. చిరుత అడుగులను గుర్తించిన ఎఫ్ఆర్వో ఖలీలొద్దీన్ మాట్లాడుతూ రుద్రంగి, మరిమడ్ల మీదుగా హన్మాజిపేటకు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని రైతులు జాగ్రత్తగా ఉండాలని, పశువులను బయట ఉంచొద్దని సూచించారు.
బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తా
బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తా


