Telangana Crime News: లాడ్జీలో వివాహిత హత్య! ఆధార్‌కార్డు తీసుకొస్తానని హంతకుడు పరార్‌!!
Sakshi News home page

లాడ్జీలో వివాహిత హత్య! ఆధార్‌కార్డు తీసుకొస్తానని హంతకుడు పరార్‌!!

Sep 18 2023 9:20 AM | Updated on Sep 18 2023 2:08 PM

- - Sakshi

రాజన్న: వేములవాడలోని జాతరగ్రౌండ్‌లోని ఓ ప్రైవేట్‌ లాడ్జీలో ఆదివారం వివాహిత సద్గుల వెంకటవ్వ(46) హత్యకు గురైంది. వివరాలు వేములవాడటౌన్‌ సీఐ కరుణాకర్‌ తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన వెంకటవ్వ వివాహం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని చంద్రంపేటకు చెందిన రాములుతో 20 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండు రోజుల క్రితం వెంకటవ్వ ఇంటి నుంచి వెళ్లినట్లు భర్త రాములు పోలీసులకు తెలిపారు. భర్త రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.

అద్దె గదిలో వివస్త్రగా..
వేములవాడలోని ఓ ప్రైవేట్‌ లాడ్జీలో శనివారం రాత్రి వెంకటవ్వ పేరుతో గదిని అద్దెకు తీసుకున్నారు. గదిలో వెంకటవ్వతోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు లాడ్జీ యజమాని తెలిపారు. అదే రోజు రాత్రి అర్ధరాత్రి సదరు వ్యక్తి లాడ్జీ నుంచి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో రికార్డ్‌ అయ్యింది.

అయితే ఆధార్‌కార్డు ఇవ్వాలని లాడ్జీ యజమాని కోరడంతో తీసుకొస్తానని చెప్పి వెళ్లిన సదరు వ్యక్తి తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన లాడ్జీ యజమాని ఆదివారం సాయంత్రం ఆ గదిని పరిశీలించగా.. బెడ్‌పై వెంకటవ్వ శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేములవాడటౌన్‌ సీఐ కరుణాకర్‌, ఎస్సై రమేశ్‌ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

అనుమానితుడి ఫొటో విడుదల..
వేములవాడ ప్రైవేట్‌ లాడ్జీలో వెంకటవ్వ హత్యకేసులో అనుమానితుడిగా పేర్కొంటున్న వ్యక్తి ఫొటోను పోలీసులు ఆదివారం విడుదల చేశారు. ఆచూకీ తెలిసినవారు వేములవాడ ఠాణా 87126 56413 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement