● ఇరిగేషన్ ఈఈతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే సత్యం
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని బూరుగుపల్లి రైతుల సాగునీటి అవసరాలు తీర్చే డీ–5 కాలువ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యంను కోరారు. కాంగ్రెస్ నాయకులు కొలుపుల ప్రవీణ్, పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డితోపాటు ఎమ్మెల్యేను శనివారం కలిశారు. డీ–5 కాలువ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రెండు కుంటల కు నీరు చేరడం లేదన్నారు. స్పందించిన ఎమ్మె ల్యే సత్యం ఇరిగేషన్ ఈఈతో ఫోన్లో మాట్లా డి.. కాలువ పనులు చేయాలని సూచించారు.
హోటళ్లపై అధికారుల దాడులు
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని పలు హోటళ్లలో జిల్లా డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల అధికారులు శనివారం దాడులు చేశారు. డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు రజిత, సత్యనారాయణ స్థానిక భారత్ గ్యాస్ గోదాంలో తనిఖీలు చేపట్టారు. అనంతరం పలు హోటళ్లపై దాడి చేసి 13 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.
మద్దిమల అడవిలో హైనా కలకలం
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని బంజేరు పరిధిలో హైనా సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులోని తుమ్మలకుంట చెరువు సమీపంలో శుక్రవారం రాత్రి కుక్కపై హైనా దాడి చేసి చంపి తిన్నది. ప్రస్తుతం వరి కోతలు, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పొలాలకు సమీపంలో హైనా సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లవద్దని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రంజిత్కుమార్ హెచ్చరించారు.
వైద్య శిబిరం పరిశీలన
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపురంలో శనివారం నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని డీఎంహెచ్వో రజిత పరిశీలించారు. 296 మందిని పరీక్షించి మందులు అందజేశారు. టీబీ వ్యాధి గురించి, పొగాకు వినియోగం తగ్గించాలని పేషంట్లకు అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రేమ్కుమార్, జీవనజ్యోతి, సూపర్వైజర్ జవహర్, హెచ్ఈవో వెంకటరమణ పాల్గొన్నారు.
మహిళలకు భద్రత కరువు
సిరిసిల్లటౌన్: దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పేర్కొన్నారు. స్థానిక నెహ్రూనగర్ ఏరియాలో ఐద్వా సభ్యత్వ నమోదును శనివారం నిర్వహించి మాట్లాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదన్నారు. కార్యదర్శి జవ్వాజి విమల, సూరం పద్మ, ఆడెపు రజిత, గడప మాధవి, న్యాలపెల్లి శ్యామల, గురజాల మమత, మల్లారపు నర్సవ్వ, రూప పాల్గొన్నారు.


