విజయవాడలీగల్: మార్కాపురం జిల్లా గిద్దలూరు పోలీసుస్టేషన్లోని పోలీసు జీపును తగలబెట్టిన కేసులో ఇద్దరు నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి ఎ.అనిత మంగళవారం తీర్పు చెప్పారు. రెండు సెక్షన్ల కింద ఒక్కొక్క సెక్షన్ ప్రకారం సంవత్సరం జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధించారు. 2014 జూలై ఒకటో తేదీన అప్పటి గిద్దలూరు ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, అతని సోదరుడు కృష్ణకిషోర్రెడ్డి సహా 21 మంది అనుచరులు పోలీసుస్టేషన్పై దాడిచేశారు. పోలీసుస్టేషన్ వద్ద ఉన్న పోలీసు జీపును తగులబెట్టారు. గిద్దలూరు పోలీసులు ఐపీసీ 435 రెడ్విత్ 149, సెక్షన్ 4 ఆఫ్ పీడీపీపీ యాక్టు కింద 21 మందిపై కేసు నమోదుచేశారు. అనంతరం విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యే న్యాయస్థానంలో నిందితులను హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ తల్లాప్రగడ సుబ్బారావు, డిఫెన్స్ తరఫున సీనియర్ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో ఉండగా ముగ్గురు నిందితులు మరణించగా, మిగిలిన 18 మందిలో 16 మందిని నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. మిగిలిన ఏ–12 సయ్యద్ షానిషావలి, ఏ–13 పాలగుళ్ల చినశ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడంతో పైవిధంగా శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
● అక్కడికక్కడే ఒకరు మృతి
● మరో ఇద్దరికి గాయాలు
మిర్యాలగూడ అర్బన్: రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపిన డీసీఎంను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం తెల్లవారు జామున జరిగింది. వన్టౌన్ సీఐ నాగభూషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామానికి చెందిన సుబ్బారావు (43), సుధాకర్ సొంత అన్నదమ్ములు. వారిద్దరితో పాటు వారి బావ తిరుపతి కలిసి వ్యక్తిగత పనిలో భాగంగా సోమవారం కారులో కరీంనగర్కు వెళ్లారు. రాత్రి తిరిగి సొంతూరుకు బయల్దేరారు. మార్గంమధ్యలో మంగళవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో మిర్యాలగూడ పట్టణంలోని రైస్మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్బంక్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ రోడ్డుపై డీసీఎంను డ్రైవర్ నిర్లక్ష్యంగా నిలిపి ఉంచాడు. వెనుక నుంచి వస్తున్న బస్సుకు దారి ఇచ్చే క్రమంలో కారును పక్కకు తిప్పడంతో డీసీఎంను ఢీకొట్టారు. దీంతో కారులో ముందు కూర్చున్న సుబ్బారావుకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి 108 అంబులెన్స్లో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే సుబ్బారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వన్టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తమ్ముడు సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


