ఒంగోలు టౌన్: జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. తొలి దశలో అత్యవసర సేవలను మినహాయించి సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో పూర్తిస్థాయి సమ్మెకు దిగారు. రెండు రోజులుగా అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జూనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు. న్యాయ సమ్మతమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం మెడికల్ కాలేజీ ఆవరణ నుంచి జీజీహెచ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య వినూత్న రీతిలో రంగోళి నిర్వహించి నిరసన తెలిపారు. స్టయిఫండ్ చేయమని అడుగుతుంటే దాన్ని వదిలి పెట్టి జూడాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం తగదని కోరారు. న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా.జాలాది మణిబాబు విజ్ఞప్తి చేశారు. 9 రోజులుగా సమ్మె చేస్తున్న జూడాలకు ఐఎంఏ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఐఎంఏ ప్రతినిధులు ఏడుకొండలు, మస్తాన్ బాషా, నటరాజ్, నాగయ్యనాయుడు, సుధాకర్, జాకబ్ జక్రయ్య, సుమయ్య ఖాన్లు జూడాలకు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. హేమంత్, కళ్యాణ్, భార్గవ్ సాయి, క్రిస్ కాంత్, కల్పన, పెన్నాకుమార్, మౌళి, నారాయణమూర్తి తదితరులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
తొమ్మిదో రోజుకు చేరిన జూడాల సమ్మె
అత్యవసర సేవలు బహిష్కరించినా స్పందించని ప్రభుత్వం
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు


