● ఫిర్యాదు చేసిన వ్యక్తిపై టీడీపీ మద్దతుదారుల దాడి
సంతమాగులూరు (అద్దంకి): నేతన్న సేవ పథకానికి సంబంధించి తమ గ్రామంలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై అధికారుల సమక్షంలోనే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటన సంతమాగులూరు మండలం చవిటిపాలెంలో మంగళవారం జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు.. మండలంలోని చవిటిపాలెంలో నేతన్నసేవలో పథకానికి సంబంధించి అవినీతి జరిగిందని గ్రామానికి చెందిన కందిమళ్ల ఆదినారాయణ ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదును విచారించేందుకు డీఎల్డీవో ఉమాదేవి మంగళవారం గ్రామ సచివాలయానికి వచ్చారు. విచారణ చేస్తున్న సమయంలోనే ఫిర్యాదుదారునిపై గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారులు గంజి శ్రీనివాసరావు, ఎం.రాంబాబు, జి.శ్రీను, జి.ఏడుకొండలు, వి.శ్రీను దాడికి పాల్పడ్డారు. విచారణాధికారి సమక్షంలోనే తనపై దాడి చేసిన వారితో తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు కందిమళ్ల ఆదినారాయణ ఫిర్యాదు చేశాడు. బాధితునికి సంతమాగులూరు పీహెచ్సీలో ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు కావాల్సి ఉంది. తనపై దాడి జరిగిందని ఫిర్యాదుదారుడు ఓ విడియో విడుదల చేశాడు.


