ఖరీఫ్ ప్రారంభమై 3 నెలలైనా అందని వ్యవసాయ పరికరాలు
మంత్రి సిఫార్సు చేసిన వారికే పనిముట్లు
ఖరీఫ్కు ముందే ఇస్తామని ప్రకటన.. అమలుకాని హామీ..
జిల్లాలో 3,132 మంది దరఖాస్తులు
ఖరీఫ్ సాగు లక్ష్యం 65,793 హెక్టార్లు
సాగైంది 8,300 హెక్టార్లు
ఖరీఫ్ సీజన్ మూడొంతులు అయిపోయింది. అయినా ఇంత వరకు రైతులకు సబ్సిడీపై అందాల్సిన వ్యవసాయ యంత్ర పరికరాలు ఇవ్వలేదు. ఇన్చార్జ్ మంత్రి చెప్పిన వారికే యంత్ర పరికరాలు వస్తాయని చెబుతుండటంతో రైతులు నిరాశ చెందుతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలను సొంతంగా కొనుగోలు చేయడం ఆర్ధికంగా భారంగా మారుతోంది. దుక్కులు దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు నివారణ, పంటల సంరక్షణ, కోత తదితర పనులకు అవసరమైన యంత్రాలను అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మంత్రి చెప్తేనే
మార్కాపురం:
ఖరీఫ్ ప్రారంభమై 3 నెలలు కావస్తున్నా అటు ప్రకృతి కరుణించకపోగా ఇటు ప్రభుత్వం కూడా రైతులపై చిన్న చూపుచూస్తోంది. అక్కడక్కడా వర్షాధారంగా పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ సాగు లక్ష్యం 65,793 హెక్టార్లు కాగా, సాగైందిమాత్రం కేవలం 8,300 హెక్టార్లు మాత్రమే. జిల్లా మొత్తం మీద 1,53,660 మంది రైతులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల కోసం సబ్సిడీ కింద మొత్తం ఉమ్మడి జిల్లాకు రూ.7.35 కోట్లు కేటాయించింది. ఇందులో మార్కాపురం జిల్లాకు రూ.3.13 కోట్లు కేటాయించారు. అయితే ప్రభుత్వం నుంచి అందాల్సిన వ్యవసాయ పనిముట్లు అయిన విత్తన గొర్రులు, పవర్ స్ప్రేయర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, హార్వెస్టింగ్ ప్రెషర్లు ఏవీ కూడా ఇంతవరకూ రైతుముంగిటకు చేరలేదు. దీంతో అన్నదాతలు అద్దెకు తెచ్చుకుని పొలాలు దున్నుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం ముందే వ్యవసాయ యంత్ర పరికరాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏరువాక దాటినా ఇంతవరకూ గ్రౌండింగ్ కాలేదు. మార్కాపురం జిల్లాలో మొత్తం 3,132 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంతమందికి వస్తాయో.. ఎంతమంది రావో.. తెలియదు. జిల్లా ఇన్చార్జి మంత్రి సిఫార్సు ఉంటే మాత్రం గ్యారంటీగా వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వం మొత్తం 9 రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందజేస్తామని తెలిపింది. అయితే కొన్ని పరికరాల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను, అప్లికేషన్ ఫారాలను స్థానికంగా అధికారులు పరిశీలించి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం కోసం పంపాలి. ఈ ఏడాది మే 19వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువుగా పేర్కొన్నారు. కచ్చితంగా రైతు ఈ క్రాప్లో నమోదై ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి వచ్చిన అప్లికేషన్లను జేసీ సమక్షంలో లాటరీ ద్వారా తీస్తారు. ఈ ప్రక్రియ జూన్ నెల 20 లోగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే దాని ఊసే పట్టించుకోకపోవడంతో నేటికీ రైతులకు అందలేదు. మొత్తం సబ్సిడీ కింద ప్రభుత్వం 3 కోట్ల 13 లక్షల 67 వేల రూపాయల కేటాయించింది. ఇందులో మార్కాపురం సబ్డివిజన్లోని మార్కాపురం, తర్లుపాడు, అర్ధవీడు, కొనకనమిట్ల, పెద్దారవీడు, పొదిలి మండలాకు రూ.96.30 లక్షలు, కనిగిరి వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని కనిగిరి, పీసీపల్లి, పామూరు, వెలిగండ్ల మండలాలకు రూ.76.99 లక్షలు, యర్రగొండపాలెం సబ్ డివిజన్లోని త్రిపురాంతకం, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, దోర్నాల మండలాలకు రూ.74.30 లక్షలు, గిద్దలూరు సబ్డివిజన్లోని గిద్దలూరు, బేస్తవారిపేట, కొమరోలు, రాచర్ల మండలాలకు రూ.66.08 లక్షలను కేటాయించారు. ఇలా కేటాయింపులు తక్కువ, రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఎవరెవరికి ఎలాంటి వ్యవసాయ యంత్ర పరికరాలు వస్తాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలను సొంతంగా కొనుగోలు చేయడం ఆర్ధికంగా భారంగా మారుతోంది. దుక్కులు దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు నివారణ, పంటల సంరక్షణ, కోత తదితర పనులకు అవసరమైన యంత్రాలను అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అద్దె భారం రైతులపై పడుతోంది. ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇస్తామని చేసిన ప్రకటించి 5 నెలలు కావస్తున్నా ఒక్క పరికరం కూడా రైతు చేతికి దక్కలేదు. సాగుకు అవసరమైన సమయంలో వ్యవసాయ పరికరాలు అందకపోతే ప్రభుత్వం ఆలస్యంగా ఇస్తే తమకు ఉపయోగం లేదని వేములకోట గ్రామానికి చెందిన పలువురు రైతులు తెలిపారు. సకాలంలో ఇస్తేనే తమకు ఉపయోగమని వారన్నారు. ప్రస్తుతం అద్దెకు యంత్రాలను తెచ్చుకుని పనులు చేసుకుంటున్నామన్నారు. ఇప్పటికై నా వ్యవసాయశాఖ అధికారులు స్పందించి వ్యవసాయ పనిముట్లను అందించాలని రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన రైతులకు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
యంత్రం
ప్రక్రియ ఇలా...
యంత్ర పరికరాలు త్వరగా ఇవ్వాలి
వ్యవసాయ యంత్ర పరికరాలను ప్రభుత్వం జాప్యం చేయకుండా త్వరగా ఇవ్వాలి. ఖరీఫ్ ప్రారంభమై 3 నెలలు దాటుతున్నా ఒక్క పరికరం కూడా రైతుకు అందలేదు. వ్యవసాయాధికారులే రైతులను ఎంపిక చేసే బాధ్యత ప్రభుత్వం ఇవ్వాలి. రాజకీయ ప్రమేయాన్ని తగ్గించాలి. పలువురు రైతులు ట్రాక్టర్లను, గొర్రులు, ఇతర సేద్య పరికరాలను అద్దెకు తెచ్చుకుంటున్నారు.
– సత్యనారాయణ రెడ్డి, వైఎస్సార్ సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి


