ఒంగోలు టౌన్: ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆ అసోసియేషన్ కమిటీ సభ్యుడు నాగభూషుని రాధాకృష్ణ ఆరోపించారు. స్థానిక సంతపేటలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కమిటీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3న నామినేషన్లు స్వీకరిస్తామని ప్రకటించారని, అయితే జిల్లా కార్యదర్శిగా పోటీ చేసేందుకు వెళ్లిన తనను నామినేషన్ వేయనివ్వకుండానే అడ్డుకున్నారని మండిపడ్డారు. సభ్యత్వం కొనసాగడం లేదంటూ కనీసం పత్రాలు కూడా తీసుకోకుండానే తిరస్కరించడం అన్యాయమన్నారు. నిబంధనల ప్రకారం అభ్యర్థి నామినేషన్ వేసిన తర్వాత స్క్రూటినీలో పరిశీలించి తిరస్కరించాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ బైలాలో సభ్యత్వ రుసుము రూ.200 అని రాసుకుని, వాస్తవానికి రూ.500 వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నామినేషన్ ఫీజు కింద ఏకంగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పడాన్ని తనతో పాటు మరికొందరు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అసోసియేషన్ కార్యదర్శి వేమూరి సుబ్బారావు రాజీనామా చేసిన తర్వాత కొత్త కార్యదర్శిని ఎన్నుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా అడ్హాక్ కమిటీని నియమించారని తప్పుబట్టారు. కొందరు నాయకులు వరుసగా మూడు, ఐదు పర్యాయాలుగా వివిధ పదవుల్లో పాతుకుపోయి ఇతరులకు అవకాశం ఇవ్వకుండా గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు. ఇదేంటని ప్రశ్నిస్తే శ్రీదిక్కున్న చోట చెప్పుకోశ్రీ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, ఇలాంటి కమిటీ వ్యవహారశైలితో ఫార్మసీ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, కమిటీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫార్మాసిస్టులు వేమూరి సుబ్బారావు, పూర్ణచంద్రరావు, రాజగోపాల్, రమేష్, భాను తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ వేయకుండానే తిరస్కరించారు
సభ్యత్వ రుసుము, నామినేషన్ ఫీజుల పేరిట దోపిడీ
నిబంధనలకు విరుద్ధంగా అడ్హాక్ కమిటీల ఏర్పాటు
అసోసియేషన్ కమిటీ సభ్యుడు నాగభూషుని రాధాకృష్ణ ఆరోపణ


