ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతున్న ఈ పరిశ్రమకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయి. ఎన్నికల ముందు కూటమి పెద్దలు విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ చార్జీల పేరుతో వీరబాదుడు బాదేశారు. అంతేకాకుండా పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీ అరకొరగా ఇచ్చింది. రూ.50 లక్షలు సబ్సిడీ రావాల్సి ఉంటే కేవలం 10 శాతం ఇచ్చారని పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు. మిగిలిన సబ్సిడీ వస్తుందో రాదోనని వారు ఆందోళన చెందుతున్నారు.
ఏఎంఆర్ కంటైనర్ పాసులతో నష్టం..
బయ్యర్లు ఒక కంటైనర్ లో 4200 అడుగుల గ్రానైట్ ఫినిషింగ్ మెటీరియల్ ఈజిప్టు, వియత్నాం, దుబాయ్, ఆస్ట్రేలియా, తదితర దేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. 4200 అడుగులకు మైనింగ్ బిల్లు 1 అడుగుకు రూ.12 చొప్పున రూ.50,400 అవుతుంది. కానీ బయ్యర్లు ఏఎంఆర్ సంస్థ దగ్గర రూ.35 వేలకు తీసుకుంటున్నారు. దీంతో బయ్యర్లకు ఒక కంటైనర్కు రూ.15,400 మిగులుతుంది. బయ్యర్లు ఏఎంఆర్ ఇస్తున్న పాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివలన గ్రానైట్ పరిశ్రమల యజమానులు ప్రభుత్వానికి చెల్లించిన మైనింగ్ బిల్లు వారి దగ్గర వృథాగా మిగిలిపోతోంది. ఇది గ్రానైట్ పరిశ్రమల యజమానులకు అదనపు భారం పడుతోంది.


