● కలెక్టర్ విజయసునీత
మార్కాపురం టౌన్: విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవష్యత్ ఉంటుందని కలెక్టర్ ఎం విజయసునీత అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ –2026 అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరింత ఉత్సాహం, పట్టుదల పెరిగి విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థి ఒకశక్తి కేంద్రమని, ధైర్యంతో లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థులు నైపుణ్యాలను నేర్చుకొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్య ద్వారానే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. అనంతరం జిల్లాలో షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపికై న 134 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి అవార్డు, రూ.20వేల నగదు చెక్కును తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, ఇంటర్మీడియెట్ బోర్డు డీఐఈఓ స్వరూపరాణి, డీఈఓ సుబ్బారావు, డీసీఈబీ కార్యదర్శి సుధాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్రెడ్డి, ఇతర విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


