ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
మార్కాపురం టౌన్: గురువారం రాత్రి ప్రకటించిన నీట్ యుజీ ఫలితాల్లో మార్కాపురం విద్యార్థి నాదెళ్ల నిహాల్ జాతీయ స్థాయిలో 438వ ర్యాంకు సాధించాడు. ఎన్ఎస్ లా అగ్రికల్చర్, హార్టీకల్చర్ కళాశాలల చైర్మన్ చంద్రమౌళి కుమారుడు నిహాల్. ఈ సందర్భంగా విద్యార్థిని విశ్రాంత ప్రిన్సిపల్ డేవిడ్లివింగ్ స్టన్, వార్డెన్ నజీర్, డాక్టర్ మచ్చ శివశంకర్, ఎస్ వెంకటేశ్వర్లు, గుంటక చెన్నారెడ్డి, ఆడిటర్ తోట సత్యనారాయణ, బద్రీనాథ్ తదితరులు సన్మానించారు.
మార్కాపురం టౌన్: జిల్లాలో 134 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డు–2026కు ఎంపికై నట్లు కలెక్టర్ ఎం. విజయసునీత తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం షైనింగ్ స్టార్స్–2026 అవార్డ్స్ బహుమతి ప్రదానోత్సవంపై జిల్లాలోని ఎంఈఓలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవార్డుకు ఎంపికై న విద్యార్థులకు రూ.20 వేల నగదుతో పాటు సర్టిఫికెట్ ఇస్తారన్నారు. మార్కాపురంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్, రూ.20 వేల నగదు అందజేస్తారన్నారు. అదేవిధంగా మెగా పీటీఎం 3.1 కు సంబంధించి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ మొబైల్లో ‘లీప్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ ఎస్.సుబ్బారావు, డీసీఈబీ సెక్రటరీ ఎం.సుధాకర్, జిల్లాలోని అందరు ఎంఈవోలు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో శరవేగంగా కోవిడ్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణితో కలిసి కోవిడ్ షెడ్లను శుక్రవారం పరిశీలించారు. కోవిడ్ సన్నద్ధతలో భాగంగా అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ అనుమానితులను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఐసోలేటెడ్ కేబిన్ ఏర్పాట్లతోపాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా బెడ్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. ఈ పరిశీలనలో నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, ఏఆర్ఎంఓ డాక్టర్ సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు.


