● ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేతల నివాళులు
ఒంగోలు సిటీ: ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, దర్శి నియోజకవర్గ పరిశీలకుడు మాదాసి వెంకయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం తన నిబద్ధత, ముక్కుసూటితనం, రాజీలేని పోరాట స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని స్మరించారు. ముద్రగడ మరణం ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడని, కాపు రిజర్వేషన్ల కోసం దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజీలేని పోరాటం చేశారన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా పనిచేసినా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే సామాజికవర్గ హక్కులకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభమేనన్నారు. కార్యక్రమంలో అరిగా మల్లికార్జునరావు, కొణికి రోశయ్య, పాలడుగు శ్రీనివాసరావు, తోట బాబి (నవీన్), అడుసుమల్లి ప్రసన్న, మల్లిశెట్టి దేవా, హనుమంతరావు, పల్లపోతు వెంకయ్య, బండారు ప్రభాకర్, కాపు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


