యర్రగొండపాలెం: వేదికపై తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుగు తమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. ఈ సంఘటన బుధవారం యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగింది. ప్రతి నెలా 3వ బుధవారం మండల స్థాయి సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలని టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఆయా మండలాల్లో తెలుగు తమ్ముళ్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశాలకు వేళ్లపై లెక్కించే కార్యకర్తలు పాల్గొంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో అనుకున్న స్థాయిలో కార్యకర్తలు పాల్గొనలేదు. పుల్లలచెరువు మండల సమావేశం ముటుకుల గ్రామంలో శ్రీసర్శ్రీ బ్యానర్ తగిలించుకొని నిర్వహించారు. మండల కేంద్రంలో సమావేశం నిర్వహిస్తే టీడీపీలో ఉన్న వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎక్కడ బాహాబాహీకి దిగుతారోనన్న ఉద్దేశంతో ముటుకులలో సమావేశం నిర్వహించారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. యర్రగొండపాలెం మండల పార్టీ కార్యాలయంలో సమావేశం ప్రారంభమైన వెంటనే మండల స్థాయిలో నాయకత్వం వహిస్తున్న ఒక నాయకుడు లేచి సమావేశాల సమయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎవరంటే వారు వేదికలపై కూర్చొని తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. వెంటనే మరో తెలుగు తమ్ముడు కలుగ చేసుకోవడంతో వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వెనువెంటనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన గొడవ బయటికి రానీయకుండా నాయకులు జాగ్రత్తపడినా నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు మాత్రం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
పార్టీ అధిష్టానానికి చేరిన రచ్చ
టీడీపీ కార్యాలయంలో జరిగిన రచ్చ ఆ పార్టీ అధిష్టానానికి చేరింది. ఇక్కడ జరిగిన సంఘటన గురించి అధినాయకులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు సమాచారం. రచ్చ బహిరంగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో స్థానిక బస్టాండ్ సెంటర్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఉదయం పార్టీ కార్యాలయంలో ఇద్దరు తెలుగు తమ్ముళ్ల రగడ సాయంత్రానికి రచ్చకెక్కింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు బస్టాండ్ సెంటర్కు చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ రెండు వర్గాలకు నచ్చచెప్పే పనిలో పడ్డారు. సెంటర్లో ఏమాత్రం గొడవలు జరిగితే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని ఎస్సై ఎం.దేవకుమార్ హెచ్చరించారు. ఎస్సై ఇరువర్గాలకు చెందిన నాయకులకు నచ్చచెప్పి వారిని బస్టాండ్ సెంటర్ నుంచి పంపించేశారు.


