● మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మద్దిపాడు: రైతన్నకు అండగా నిలుద్దాం పొగాకు రైతుల కోసం పోరాడదామని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17వ తేదీ శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించే రైతు దీక్షలో రైతు సంఘాల నాయకులు, పొగాకు రైతులు పాల్గొనాలని కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన పొగాకు రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముద్రగడ మృతికి మేరుగు సంతాపం
మద్దిపాడు: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ముద్రగడ మృతి వార్త విన్న వెంటనే తాను దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఆయన మృతి విచారకరమని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
భార్య రాజీకి రావాలని..
● పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మార్కాపురం టౌన్:
భార్య, భర్తల మధ్య గొడవల నేపథ్యంలో భార్య రాజీకి రావాలని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మార్కాపురం పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. గతంలో మార్కాపురం టౌన్ ఎస్ఐ వద్ద ప్రైవేటు డ్రైవర్గా పనిచేసిన షేక్ ఆరిఫ్కు తన భార్యతో గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం భార్య తరఫు బంధువులు ఎస్కే ఆరిఫ్ ఇంటికి వచ్చి..ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుందామన్నారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకరికొకరు తిట్టుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే తన భార్యతో పోలీసులు కేసు రాజీచేస్తారని భావించిన ఆరిఫ్ పోలీస్స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని లోపలికి వచ్చాడు. అది గమనించి పోలీసులు అతని ఒంటిపై దుస్తులు తొలగించారు. అయితే ఈ సంఘటనపై ఎస్సై విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా ఆరిఫ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


