నాగులుప్పలపాడు: చదలవాడ పశుక్షేత్రంలో ఈ నెల 23వ తేదీ ఒంగోలు జాతి పశువులకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పశు ఉత్పతి క్షేత్రం ఉపసంచాలకుడు డా.బి.రవి తెలిపారు. ఈ వేలంలో ఒంగోలు జాతి ఒట్టి ఆవులు 8, పెయ్య దూడలు 16, ఒంగోలు జాతి కోడె దూడలు 25, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు 2 మొత్తం 51 పశువులకు చదలవాడ పశుక్షేత్రంలో 23వ తేదీ ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేలంలో పాల్గొనే రైతులు రూ.5 వేల ధరావత్తు చెల్లించాలన్నారు. వివరాలకు 93929 01049 నంబరును సంప్రదించాలన్నారు.
తాళ్లూరు: తమకు ఆరు నెలలుగా జీతాలు అందలేదంటూ రామతీర్థం స్కీం కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తూర్పు గంగవరం సచివాలయం వద్ద ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద సాగర్ నీటిని నిలిపేసి పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ స్కీం కార్మికులు మాట్లాడుతూ అగ్రిమెంట్లో ఉన్న నిబంధనల ప్రకారమే జీతాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, బ్యాంక్ అకౌంట్ ద్వారా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆరు నెలలుగా నిలిపేసిన జీతాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


