ముండ్లమూరు: న్యాయం చేయాలని కోరుతూ వృద్ధురాలు స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే..ముండ్లమూరు మండలం కొక్కెర కొండయ్యపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు సంపతి వెంకటమ్మకు చెందిన పొలాన్ని, ఇంటిని లాక్కోని కోడలు బయటకు నెట్టింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఏఎస్సై రూ.55 వేలు తీసుకొని న్యాయం చేస్తానని నమ్మబలికాడు. కానీ ఎన్ని రోజుల నుంచి పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో సోమవారం ఉదయం 10గంటలకు పోలీస్స్టేషన్కు వెళ్లిన వృద్ధురాలు ఏఎస్సై పవన్ వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకుంది. మధ్యాహ్నం వరకు ఎర్రని ఎండలో నిలబడి ఉంది. అయినా ఎవరూ పట్టించుకున్న వారే లేరు. చివరకు విలేకరులు వచ్చి ఫొటోలు తీసుకోవడంతో పోలీసులు వచ్చి ఆమెను లోపలికి తెసుకెళ్లి ఆమె కోడలిపై కేసు పెట్టారు. కానీ ఏఎస్సై తీసుకున్న నగదు మాత్రం ఇవ్వలేదు. కానీ సోమవారం రాత్రి కూడా వృద్ధురాలిని స్టేషన్కు పిలిపించి రాజీ ప్రయత్నాలు చేయడం గమనార్హం.
న్యాయం చేస్తానని ఏఎస్సై నగదు తీసుకున్నాడు
75 ఏళ్ల వయసులో నన్ను ఇబ్బంది పెడుతున్నారని కన్నీరు


