న్యూస్రీల్
పెద్ద తలకాయల హస్తం...
విశాఖ నుంచి ఒంగోలు వరకు టోల్ ప్లాజాలు దాటుతున్న గంజాయి వాహనాలు
బొల్లాపల్లి, టంగుటూరు టోల్ప్లాజాలున్నా నామమాత్రపు తనిఖీలు
ఒంగోలులో పట్టుబడిన లారీలో 250 కిలోల గంజాయి లభ్యమైనా చర్యలేవీ?
అధికార పార్టీ పెద్దల హస్తంపైనే సందేహాలు
గంజాయి మత్తులో పెరుగుతున్న దాడులు
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
గంజాయి గుప్పు..
సాక్షి టాస్క్ఫోర్స్:
జిల్లా కేంద్రమైన ఒంగోలులో తరచుగా గంజాయి పట్టుబడుతోంది. విశాఖ నుంచి రైలు మార్గం ద్వారానే కాకుండా రోడ్డు మార్గంలో లారీలు, కార్లు, మోటారు బైకుల ద్వారా గంజాయిని తరలిస్తున్నారు. వీటిలో అత్యధికంగా తమిళనాడు, కేరళకు సంబంధించిన నిందితులే పట్టుబడుతున్నారు. అయితే ఇటీవల ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో బాలాజీ నగర్ వద్ద పోలీసులకు పట్టుబడిన 10 కిలోల గంజాయి స్థానికంగా విక్రయాలు చేయడానికి తీసుకొని వచ్చిందేనని పోలీసుల విచారణలో నిర్ధారించడం తెలిసిందే. స్థానికంగా పేరు మోసిన ఒక పాత నేరస్తుడు ఒంగోలులో గంజాయిని విక్రయించడానికి ఒడిశా నుంచి తరలించినట్లు సమాచారం. జిల్లా మీద నుంచి భారీగా రవాణా జరుగుతున్న గంజాయి వెనక అధికార పార్టీకి చెందిన పెద్దల హస్తముందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒంగోలు నగరంలో గంజాయి మత్తులో గొడవలు జరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని టీ స్టాల్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే గంజాయి తాగి ఉన్న పొన్నూరు ప్రసాద్ అనే వ్యక్తి వడియాల సుబ్బారావు అనే యువకుడిని కత్తితో గొంతు మీద పొడిచాడు. ప్రస్తుతం సుబ్బారావు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు.
టోల్ప్లాజాల వద్ద గస్తీ కళ్లు గప్పి..
గత నెల 2వ తేదీ అర్ధరాత్రి ఒంగోలు శివారులోని కల్వరి టెంపుల్ సమీపంలో ఆగి ఉన్న మినీ లారీలో 250 కిలోల గంజాయి పట్టుబడింది. అర్ధరాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని నగరంలోని అరవ కాలనీకి చెందిన కొడియం లోకేష్ అనే యువకుడు బైకు మీద ఇంటికి తిరిగి వస్తూ వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలై మరణించాడు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల తనిఖీలో ఐషర్ మినీ లారీలో రహస్యంగా తరలిస్తున్న గంజాయి కనిపించింది. బస్తాలలో ఉన్న గంజాయిని చూసి పోలీసులు విస్మయానికి గురయ్యారు. ఆ తరువాత పోలీసుల విచారణలో సుమారు 250 కిలోలకు పైగా గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. ఇంత పెద్ద మొత్తంలో జాతీయ రహదారి మీదుగా గంజాయి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ నుంచి ఒంగోలు వరకు అనేక టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఒక్క ఒంగోలు జిల్లాలోనే ఒకవైపు మార్టూరు సమీపంలో బొల్లాపల్లి టోల్ప్లాజా ఉంది. ఇటువైపు టంగుటూరు టోల్ ప్లాజా ఉంది. ఇక్కడ నిత్యం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయినా ఈ మార్గం గుండా తరచుగా కార్లలో, మోటారు బైకుల్లో దర్జాగా గంజాయి తరలి పోతోంది. టంగుటూరు టోల్ప్టాజా వద్ద తరచుగా గంజాయి పట్టుబడుతుండడం దీనికి నిదర్శనమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఐషర్ వాహనం మరమ్మతుల కారణంగా ఒంగోలు శివారులో నిలిచినట్లు చెబుతున్న దాంటో ఎంత వాస్తవముందన్న దానిపై కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భారీగా గంజాయి రవాణా జరుగుతున్న సమయంలో లారీకి ముందు వెనక పలు మోటారు వాహనాలలో గంజాయి మాఫియా సభ్యులు అనుసరిస్తుంటారని, మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినా నిముషాల్లో సరుకు మాయం చేస్తారని తెలుస్తోంది. ఒంగోలులో సరుకు దించడానికి ఆగి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో అసలు గుట్టుబయట పడింది. లేకపోతే గుట్టుగా గంజాయి తరలివెళ్లిపోయేది.
గంజాయి రవాణా వెనక పెద్ద తలకాయల హస్తమున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అధికార పార్టీ కీలక నాయకుడి అనుచరులు గంజాయి రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో పోలీసుల అండదండలు కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు కీలక నాయకుడి నియోజకవర్గంలో పోలీసు అధికారి ఒకరు టాస్క్ఫోర్స్ అధికారులను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పట్టుబడుతున్న గంజాయి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటించడంలో సహకరిస్తున్న పెద్ద తలకాయ ఎవరనేది నిస్పక్షపాతంగా విచారణ జరపితేనే కాని బయటపడే అవకాశాలు లేవు. టాస్క్ఫోర్సు అధికారులు మొక్క్బుడిగా దాడులు నిర్వహిస్తున్నారని, గంజాయి అక్రమ రవాణా మూలాలు విషయంపై దృష్టిసారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, లేదా ప్రత్యేకంగా తనిఖీలు చేసినప్పుడో పెద్దమొత్తంలో తరలిస్తున్న గంజాయి పట్టుబడటం చర్చనీయాంశమవుతోంది. యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. ఆ మత్తులోనే దాడులకు, ఇతర నేరాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న రెండు టోల్ప్లాజాలను దాటి గంజాయి తరలిపోతుండటం వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటించడంలో సహకరిస్తున్న పెద్ద తలకాయ ఎవరనేది నిస్పక్షపాతంగా విచారణ జరిపితేనే కానీ బయటపడే అవకాశాలు లేవు. టాస్క్ఫోర్సు అధికారులు మొక్కుబడి దాడులతో సరిపెడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


