జరుగుమల్లి(సింగరాయకొండ): పాలేరు నదిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ఇరుక్కున్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరుగుమల్లి మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ కంపెనీ గోడౌన్ సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం పాలేరు నదిలో జరుగుమల్లి, చింతలపాలెం, సతుకుపాడు ప్రాంతంలో రాత్రి పూట టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలిసి కూడా రెవెన్యూ, పోలీసు, మైనింగ్, గ్రామ పంచాయతీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించటమే కాక ట్రాక్టర్ల ద్వారా తప్ప టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేయడం లేదని నమ్మబలుకుతున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీ గోడౌన్ సమీపంలో పాలేరు నదిలో భారీ చైన్ యంత్రాలతో ఇసుక లోడింగ్ చేసుకుని వస్తున్న టిప్పర్ ఇసుకలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన సుమారు రాత్రి 3 గంటల సమయంలో జరగ్గా తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో రెండు భారీ చైన్ యంత్రాల సహాయంతో టిప్పర్ను బయటకు తీశారు. ఇసుక టిప్పర్ పాలేరులో ఇరుక్కున్న విషయం రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా వారు ఆ పక్కకు కూడా పోలేదని, యంత్రాలను, టిప్పర్ను పట్టుకుని కేసు నమోదు చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలో ఇసుక అక్రమ రవాణా సాగుతుందనడానికి ఈ టిప్పరే సాక్ష్యమని స్థానికులంటున్నారు. ఇకనైనా అధికారులు మామూళ్ల మత్తులో తూగకుండా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


