ఉలవపాడు: వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు మామిడి రైతులకు చేటు తెచ్చాయి. వారం రోజుల క్రితం కురిసిన వర్షం, ఆ తరువాత చల్లటి వాతావరణంతో మామిడి కాయలకు పురుగులు వచ్చేశాయి. చల్లటి వాతావరణంతో పండు ఈగ ప్రభావం ప్రారంభమైంది. మామిడి సీజన్ చివరి దశకు చేరడంతో దాదాపు కాయలన్నీ కోసేశారు. చివరి దశలో కేవలం 5 నుంచి 10 శాతం తోటల్లో మాత్రం కాయలు వచ్చాయి. చివరి దశ కాయలు మంచి రేటు వస్తాయని మామిడి రైతులు ఆశించారు. కానీ ఊహించని విధంగా మామిడి కాయలలో పురుగులు ప్రారంభమయ్యాయి. కాయలను కోసి చూస్తే చాలు లోపల నుంచి పురుగులు బయటకు వస్తున్నాయి. అధిక రేటు పెట్టి కాయలు కొన్నా లోపల పురుగులు వస్తున్నాయి. ఈ ఏడాది మూడు నెలల సీజన్ లో ఎక్కడా పురుగులు తగలలేదు. వేడిమి అధికంగా ఉండడంతో కాయలు సైతం రుచిగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉలవపాడు ప్రాంతంలో కాయలు కొంటే పురుగులు వస్తున్నాయి. దీని కారణంగా ఎంతో ఆశతో తినాలని పంపించిన మామిడి కాయలు పురుగులు రావడంతో మామిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉలవపాడు మామిడి నాణ్యత కోల్పోయిందన్నది మాత్రం వాస్తవం.


