● ప్రముఖ గాయని ఎస్ జానకికి ఒంగోలుతో అనుబంధం
ఒంగోలు టౌన్/ఒంగోలు మెట్రో/ఒంగోలు సబర్బన్: ‘‘నీలి మేఘాలలో...గాలి కెరటాలలో నీవు పాడే పాటా వినిపించు ఈ వేళా..’’ అంటూ తెలుగు నేల నలుచెరగులా తేనెలొలికే ఆ గొంతుతో అలరించిన మధురగాయని ఎస్ జానకి పాటల పూదోటను వదిలి దిగికేగారు. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో కూడా మూడేళ్ల పసిపాపలా పాడగలిగే ఆ మధుర గాయకురాలికి మన ఒంగోలు నగరంతో గుర్తు చేసుకోదగ్గ అనుబంధం ఉంది. ఒంగోలుకు చెందిన ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ దగ్గర జానకమ్మ శిష్యరికం చేశారు. తిరుపతి సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన కొంతకాలం ఒంగోలులో నివాసం ఉన్నారు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నవారిలో ఒంగోలుకు చెందిన ఐ.మురళీ కృష్ణ కూడా ఒకరు. ఒంగోలు జిల్లా మలేరియా కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న మురళీకృష్ణ టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ గాయకుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో వెంకటేశ్వర స్వామి పాటలు పాడుతున్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జానకమ్మతో కలిసి మురళీకృష్ణ వెంకటేశ్వర స్వామి గేయాలు ఆలపించారు. జానకమ్మ మరణ వార్త తెలిసిన ఆయన ఈ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. గొప్ప గాయకురాలిగా పేరొందినప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా అందరితో కలిసి పోయే గొప్ప వ్యక్తిత్వం జానకమ్మ సొంతమని మురళీ కృష్ణ చెప్పారు. అలాగే 1989 నుంచి జిల్లాలో అనేక కార్యక్రమాల్లో జానకమ్మ పాల్గొన్నారు. ఒంగోలు సీవీఎన్ రీడింగ్ రూం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన శత గీత సంగీత విభావరిలో, 2013 ఏప్రిల్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించిన తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొన్నారు. ఒంగోలుకు చెందిన ఈలపాట అర్లయ్య సంగీత కచేరీలో ఆమె పాల్గొన్నారు. జానకమ్మ మరణం సంగీతాభిమానులకు తీరనిలోటని ఒంగోలుకు చెందిన సాహితీవేత్త మురళీధర్రెడ్డి అన్నారు.


