● రూ.5 లక్షల విలువైన
బంగారం, వెండి అపహరణ
పెద్దారవీడు: మండలంలో ఎస్.కొత్తపల్లి గ్రామంలో ఇమ్మశెట్టి వెంకటేశ్వర్లు ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి నగలు అపహరణకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని పంచలో కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర్లు నిద్రిస్తుండగా, అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక ఉన్న తలుపును పగులగొట్టి లోనికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాను కూడా పగలగొట్టారు. అందులో ఉన్న బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు. వాటి విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. కూలి పనులు చేసుకుని సంపాదించిన సొమ్మంతా దొంగలు ఎత్తుకెళ్లారంటూ వాపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఒంగోలు నుంచి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు త్రిపురాంతకం సీఐ హాసాన్, ఎస్ఐ సైదులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల దేవరాజుగట్టు గ్రామంలో కూడా దొంగలు పడి దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారు నగలు చోరీ చేశారు. మండలంలోని పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు, బోర్ల కేబుల్ వైర్లు దొంగిలించారు. ఆ ఘటనలు మరవకముందే మళ్లీ దొంగతనం జరగడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.


