మార్కాపురం: మార్కాపురం జిల్లా తొలి ఓఎస్డీగా ఐపీఎస్ అధికారి నవజ్యోత్ మిశ్రా శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2021 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన స్వరాష్ట్రం బీహార్. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా మార్కాపురం ఓఎస్డీగా నియమితులయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనను మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు, సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఇతర ఎస్సైలు, పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
స్థల వివాదం..
పీసీపల్లి: మండలంలోని అడవిపల్లి గ్రామంలో గేదెలు కట్టే స్థలం విషయమై రెండు కుటుంబాల మధ్య శుక్రవారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోడూరి నరసింహ స్థలంలో కొద్దికాలంగా మూలే రమణయ్య తన గేదెలను కడుతున్నాడు. వద్దని నరసింహ వారించడంతో, ఆ గేదెలను కోడూరి కొండారెడ్డి స్థలంలో కట్టాడు. దీంతో కొండారెడ్డి కుటుంబ సభ్యులు గేదెలను విప్పేయడంతో వివాదం రాజుకుంది. ఇరు వర్గాలకు చెందిన నరసింహ, కొండారెడ్డి, మల్లికార్జున, మాలకొండయ్య, రమణయ్య, పెద్దిరెడ్డి, శ్రీను తదితరులు ఒకరిపైఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. దాడిలో కొండారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఈ వివాదంపై గురువారమే ఎస్సై నరసింహారావు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశామని, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.


