కురిచేడు: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి దుకాణం పైకి దూసుకెళ్లిన ఘటన గురువారం అర్ధరాత్రి కురిచేడులో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పూజిత ట్రావెల్స్కు చెందిన బస్సు (ఎన్ఎల్ 01 బి 3198) కురిచేడు బస్టాండ్ సెంటర్ వద్దకు రాగానే అదుపుతప్పింది. నేరుగా వెళ్లి బస్టాండ్ ఆవరణలోని రజనీ ఫ్యాన్సీ స్టోర్ను బలంగా ఢీకొట్టింది. సాధారణంగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు రాత్రి వేళల్లో ఆ దుకాణం వద్దే లగేజీలు పెట్టుకుని బస్సుల కోసం వేచి చూస్తుంటారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో దుకాణం ముందున్న రేకులు పూర్తిగా వంగిపోయాయి. అక్కడే ఉన్న ఓ ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్టాండ్ సెంటర్లోని ప్రజలు అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై జి.కోటయ్య అక్కడికి చేరుకున్నారు. ట్రావెల్స్ యజమానిని పిలిపించి నష్టపరిహారం విషయం మాట్లాడతామని దుకాణ యజమానికి ఎస్సై హామీ ఇచ్చారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా బస్సును హైదరాబాద్కు పంపించివేశారు.
కురిచేడు బస్టాండ్ సెంటర్లో అర్ధరాత్రి ఘటన
దుకాణం రేకులు, ద్విచక్ర వాహనం ధ్వంసం
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడంటూ స్థానికుల ఆందోళన


