మార్కాపురం టౌన్: క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ ఎం.విజయ సునీత గురువారం మార్కాపురం మండలం రాయవరంలో కేజీబీవీలో విద్యార్థినులతో కలెక్టర్ సరదాగా ముచ్చటించారు. ఉన్నత చదువులే ఉజ్వల భవిష్యత్తుకు మార్గాలని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండి లక్ష్యం వైపు పయనించాలని సూచించారు. స్వయంగా బ్లాక్బోర్డుపై సౌర కుటుంబం గురించి బోధించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.
● పదోన్నతిపై ‘అప్పా’కు జ్యోతిరాణి
ఒంగోలు టౌన్: ఒంగోలు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) పోస్టు ఏడాది తర్వాత ఎట్టకేలకు భర్తీ అయింది. ఈ మేరకు ఎన్.యుగంధర్ బాబును ఆ స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యుగంధర్ బాబు ప్రస్తుతం నంద్యాల అడిషనల్ ఎస్పీ(అడ్మిన్గా విధులు నిర్వహిస్తున్నారు. నంద్యాల డీఎస్పీగా పని చేసిన ఆయన, పదోన్నతి పొంది అదే జిల్లాలో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా పనిచేసిన నాగేశ్వరరావు పదోన్నతిపై బదిలీ అయినప్పటి నుంచి ఈ పోస్టు ఏడాదికి పైగా ఖాళీగా ఉంది. అదేవిధంగా, పీటీసీలో డీఎస్పీగా పనిచేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొందిన పి.జ్యోతిరాణిని ‘అప్పా’కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆమె వెయిటింగ్లో ఉన్నారు.


