ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రధాన సమస్యల పరిష్కారంపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ, అలాగే టెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 14వ తేదీన ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించే ర్యాలీ, పికెటింగ్ను విజయవంతం చేయాలని ఫ్యాప్టో ప్రకాశం జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. స్థానిక మల్లయ్య భవననంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కే.ఎర్రయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్ఎండీ రఫీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఫ్యాప్టో నాయకురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి, మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగిస్తున్న టెట్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 14న జరిగే ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జూలై 14 ఉదయం 9.00 గంటలకు పాత జెడ్పీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ ప్రారంభమై, ఉదయం 11 గంటలకు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద పికెటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలైన ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్–257, ఏపీటీఎఫ్–1938, బీటీఏ, హెచ్ఎం అసోసియేషన్, ఎస్ఏఏఎస్, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, రూట, పీఈటీ అసోసియేషన్ నాయకులు కే.ఎర్రయ్య, అబ్దుల్ హై, శేషారావు, లక్ష్మీనారాయణ, దేవసహాయం, ఎస్.ఎం.డి. రఫీ, దార్ల జయరావు, కార్యవర్గ సభ్యులు పీవీ సుబ్బారావు, చల్లా శ్రీనివాసులు, గవిని శివశంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీ, పికెటింగ్ను విజయవంతం చేయాలని ఫ్యాప్టో పిలుపు


