అద్దంకి: నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అద్దంకి పట్టణ శివారులోని నల్లవాగు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సంతమాగులూరు మండలం అడ్డరోడ్డుకు చెందిన దత్తు, దుర్గ, హనుమాయమ్మలు తమ లారీని రోడ్డు పక్కన నిలిపి, డివైడర్ మధ్యలో గడ్డి తొలగింపు పనులు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్డుపై శ్రీస్టాప్ కోన్శ్రీలను ఏర్పాటు చేశారు. అయితే, అటుగా వచ్చిన మరో లారీ వేగంగా దూసుకొచ్చి, రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో, అందులో కూర్చున్న దత్తు (పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం ఈరాటం గ్రామం) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు తీవ్ర శ్రమకోర్చి బయటకు తీశారు.
ఒకరి పరిస్థితి విషమం
బాధితులను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో దుర్గను మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆస్పత్రికి తరలించగా, హనుమాయమ్మ అద్దంకిలో చికిత్స పొందుతోంది. మృతుడు దత్తుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


