భవిష్యత్
● రైతు రుణమాఫీతో అన్నదాతలకు అండగా నిలిచిన మహానేత ● వైఎస్సార్ హయాంలోనే శరవేగంగా వెలిగొండ నిర్మాణం ● గుండ్లకమ్మ, రామతీర్థంలకు జలసవ్వడులు ● ఒంగోలు కేంద్రంగా రిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కళాశాల ● నేడు వైఎస్సార్ జయంతి
కాలం కదిలిపోతోంది. కానీ కొన్ని జీవితాలు కాలంగర్భంలో కలిసిపోవు. తరతరాల చరిత్రలో శాశ్వత అధ్యాయాలుగా నిలిచిపోతాయి.
అలాంటి అరుదైన జీవితమే ఆయనది.
అధికారం ఆయనకు కిరీటం కాదు. ప్రజల
జీవితాలను మార్చేసిన సాధనం. సంక్షేమాన్ని ప్రభుత్వ విధానంగా కాక, సామాజిక
న్యాయానికి ప్రతీకగా కోట్లాది కుటుంబాల
జీవితాల్లో వెలుగులు నింపిన పాలకుడు. విద్యను పేదవాడి హక్కుగా, వైద్యాన్ని ప్రతి కుటుంబానికి భరోసాగా, వ్యవసాయాన్ని అన్నదాత ఆత్మగౌరవంగా, పారిశ్రామికాభివృద్ధిని యువత భవిష్యత్కు పునాదిగా మలచాలన్న దూరదృష్టి కలిగిన స్వాప్నికుడు. కరువునేలపై జల జీవం పోసి, బంజరు భూములను
బంగారు నేలగా మార్చిన అపర భగీరథుడు. ఆయన హయాంలోనే వెలిగొండ పురుడుపోసుకుంది. రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టుల ద్వారా జలసవ్వడులు చేశాయి. రైతు మోముపై చిరునవ్వు తొణికిసలాడింది. తరతరాల అభ్యున్నతికి డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి వేసిన శాశ్వత పునాదులు ఎంతో మందికి ఆసరాగా నిలిచాయి. నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆయన గుర్తులు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.477 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. శరవేగంగా పనులు సాగుతున్న సమయంలో ఆయన మరణంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. 2014 నుంచి 2019 చంద్రబాబు పాలనలో వెలిగొండ దాదాపుగా మూలనపడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా పనులన్నీ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిన అరకొర పనులు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రకటనలతో గారిడి చేస్తోంది.
రైతుకు స్వర్ణయుగం..
రైతు రుణమాఫీ ఫైలుపై రాజన్న తొలి సంతకం చేశారు. 2004 మే నెలకు ముందు జిల్లాలో 63,559 మంది బకాయిలు రద్దు చేశారు. అప్పటికే జిల్లా వ్యాప్తంగా 71,321 మంది రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. జిల్లాలో రైతు భరోసా అందుకున్న రైతులు 2.96 లక్షల మంది ఉన్నారు. రాజన్న మరణం తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులకు గడ్డుకాలంగా మారింది. రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుకు మంచి రోజులొచ్చాయి. ఐదేళ్లూ రైతులకు అండగా నిలవడంతో రైతులు లాభాలతో పండగ చేసుకున్నారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తొలి ఏడాది రైతులకు అందించే సాయానికి ఎగనామం పెట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రెండో ఏడాది లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించేశారు. ప్రస్తుతం 2.5 లక్షల మందికి మాత్రమే ఇస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లుగా జిల్లాలో మిర్చి, పొగాకు, పత్తి, శనగ, ధాన్యం, మామిడి ఇలా దేనికీ కనీస మద్దతు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారు.
పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సాయం
పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువులు ఆగిపోకూడదంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులభ్యసించారు. చంద్రబాబు పాలనలో ఆ పథకం నీరుగారడంతో పేద విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తిరిగి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేయడం ద్వారా విద్యార్థులకు అండగా నిలిచారు. ఆ ఐదేళ్లలో 3,09,817 మంది విద్యార్థులకు విద్యా దీవెన, 2,72,315 మంది విద్యార్థులకు వసతి దీవెన ద్వారా కోట్ల రూపాయల సాయం అందించారు.


