టీడీపీ నాయకుల బండ్లపై బీఎల్ఓలు అధికార పార్టీకి తొత్తులుగా మారిన వైనం
ఉలవపాడు: సర్ కార్యక్రమం కూటమి నాయకుల కనుసన్నల్లో జరుగుతోంది. కూటమి నాయకులకు అధికారులు జీహుజూర్ అనడంతో సర్ కార్యక్రమం కాస్త అభాసుపాలవుతోంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల పరిధిలో మొత్తం 53 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 45,219 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీయఎల్ఓలు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. మండల పరిధిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఎల్ఏ కు కొన్ని చోట్ల సమాచారం కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. ఇక ఉలవపాడులో అయితే బీఎల్ఓలుగా ఉన్న అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల బండ్ల మీద తిరుగుతూ వారి చెప్పింది తూచ తప్పకుండా చేస్తున్నారు. ఉలవపాడులోని 243 పోలింగ్ బూత్కు చెందిన మహిళా బీఎల్ఓ ఏకంగా టీడీపీ నాయకుని బండి మీద తిరుగుతూ వారు చెప్పినట్లు చేస్తున్నారు. 241 పోలింగ్ బూత్ బీఎల్ఓ కేవలం టీడీపీ బీఎల్ఏని మాత్రమే తీసుకుని ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. మండల పరిధిలో అధిక శాతం బీఎల్ఓలు ఓటుకు సంబంధించిన పేపర్లను ఇళ్లకు వచ్చి ఇచ్చారు.. కానీ పూర్తిచేసిన వాటిని తీసుకెళ్లడం లేదు. కేవలం టీడీపీ నాయకులతో వెళ్లిన ఓట్లకు సంబంధించిన సమాచారం మాత్రం ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పలువురు టీడీపీ నాయకులు దగ్గరుండి కంప్యూటర్ ఆపరేటర్లలా ఓట్ల నమోదు చేయిస్తున్నారు. సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి పర్యవేక్షణ చేయాల్సిన తహశీల్దార్ రవిశంకర్ అసలు కార్యక్రమం గురించి ఎక్కడా తనిఖీలు చేసినట్లు గానీ పరిశీలించినట్లు గానీలేదు.


