ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సారానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు వివిధ కోర్సులకు సంబంధించి మొత్తం 1,027 మంది విద్యార్థులు హాజరవగా, వారిలో 80.62 ఉత్తీర్ణత శాతంతో 828 మంది విద్యార్థులు పాసైనట్లు పరీక్షల నియంత్రణాధికారి (సీఈ) ప్రొఫెసర్ జి.సోమశేఖర తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు, సీఈ సోమశేఖర, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ భారతిదేవి అభినందించారు. మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమంలో పీజీ ప్రొఫెషనల్ కోర్సుల కో ఆర్డినేటర్ (నాన్ – కాన్ఫిడెన్సిల్ విభాగం) డాక్టర్ ఎ.అమతవల్లిదేవి, బీఎడ్ కోర్సుల కో ఆర్డినేటర్ (నాన్ – కాన్ఫిడెన్సిల్ విభాగం) డాక్టర్ ఆర్.శ్రీనివాసు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం: మద్యం మత్తులో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం యర్రగొండపాలెంలోని కొలుకుల రోడ్డులో ఉన్న పున్నయ్య మిల్లు వద్ద జరిగింది. పుల్లలచెరువు తండాకు చెందిన కప్పలగుంట్ల పవన్కుమార్ నాయక్(24) మద్యానికి బానిస కావడంతోపాటు తాను వివాహం చేసుకున్న భార్యను వదలిపెట్టి రెండేళ్లుగా మరొకరితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఉదయం నుంచి మద్యం తాగుతున్న ఆ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపల నుంచి గడి పెట్టుకొని పై కప్పునకు తాడు బిగించి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పవన్ కుమార్ నాయక్ తండ్రి బాలు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ తెలిపారు.


