ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం పనికిరాదని, బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారితో కలిసి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని అధికారులను హెచ్చరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా సత్వరం పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో ఆ సమస్యను పరిష్కరించలేని పక్షంలో అర్జీదారునికి అర్థమయ్యే విధంగా తెలియజేసి ఎండార్స్మెంటు ఇవ్వాలని ఆయన చెప్పారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు. మీకోసం అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ మాధురి, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మార్కాపురంలో మీ కోసంకు 243 అర్జీలు...
మార్కాపురం టౌన్: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మార్కాపురం కలెక్టర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని చెప్పారు. మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నూరు శాతం పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి 161 అర్జీలు, ఇతర శాఖలకు సంబంధించి 82 అర్జీలు వచ్చాయని తెలిపారు. త్వరలో యర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో ఒక నెలలో 4 వారాల పాటు 4 ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి శివరామిరెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మనిష్యే, జిల్లా పంచాయతీ అధికారి బాలునాయక్, విద్యుత్ శాఖ ఎస్సీ అబ్దుల్ కరీం, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్ రావు, జిల్లా రవాణాశాఖ అధికారి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
మీ కోసం కార్యక్రమంలో అధికారులతో
కలెక్టర్ రాజాబాబు


