● ఓ వ్యక్తి ప్యాంట్ విప్పి మహిళలకు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తన
దర్శి: టీడీపీలోని ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 15 మందికి గాయాలు కాగా, ఓ వ్యక్తి ప్యాంట్ విప్పి మహిళలకు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ప్రకాశం జిల్లా బండి వెలిగండ్లలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామంలోని మాజీ రేషన్ డీలర్ యాదాల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు, ప్రస్తుత డీలర్ కంట బాబు, కంట రామయ్య, యాదాల గురునాథంల మధ్య రాజకీయ కక్షలతో ఒకరిపై ఒకరు రాళ్లతో, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకి గాయాలయ్యాయి. గాయపడిన వారిని దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గొడవ జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు రెండు గంటల సేపు ఘర్షణ జరిగింది. ఆ వీడియోల్లో ఓ ఇంటిపై రాళ్లు విసిరేసి ఇంట్లో వాహనాలను ధ్వంసం చేశారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. ఒక వ్యక్తి ప్యాంట్ విప్పి మహిళలకు చూపించినట్లు ఉంది. ఘర్షణలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. పోలీసులు ఈ కేసుని రాజీ చేయడానికి చూస్తున్నట్లు సమాచారం.
బేస్తవారిపేట: మండలంలోని పూసలపాడులో అభయాంజనేయస్వామి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో బండ పందెం పోటీలు ఆదివారం నిర్వహించారు. నంద్యాల జిల్లా సంబవరానికి చెందిన జూపల్లి ప్రభాకరరెడ్డి ఎడ్లు 3292 అడుగుల దూరంలాగి మొదటి స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా గోసపాడు మండలం సంబవరానికి చెందిన బీరం బుల్స్ ప్రభాకరరెడ్డి ఎడ్లు 2671 అడుగుల దూరంతో ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా పంగులూరు మండలం జే పంగులూరుకు చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్లు 2545 అడుగులతో తృతీయ స్థానంలో, నంద్యాల జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన బోరెడ్డి జనార్థనరెడ్డి 2521 అడుగుల దూరంతో నాల్గొవ స్థానంలో నిలిచాయి. మార్కాపురం జిల్లా కంభం మండలం దరగకు చెందిన కృష్ణయ్యయాదవ్ ఎడ్లు 2500 అడుగుల దూరంతో ఐదో స్థానం సాధించాయి. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు మొదటి, రెండో, మూడో, నాల్గోవ, ఐదోవ బహుమతులు వరుసగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను దాతలు పంపిణీ చేశారు.


