● స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
మేదరమెట్ల: డిగ్రీ చదువుతున్న యువకుడు తన స్నేహితుని పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు జీపు నుంచి రోడ్డుపై పడి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన కొరిశపాడు మండలం దక్షిణ బైపాస్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. మండల పరిధిలోని పాత దామావారిపాలేనికి చెందిన షేక్ ఆసీఫ్ (19) తన స్నేహితుని పుట్టిన రోజు సందర్భంగా మరో ఐదుగురు స్నేహితులతో కలిసి టాప్లెస్ జీపులో శుక్రవవారం రాత్రి అద్దంకి నుంచి మద్దిపాడు మండల పరిధి గుండ్లాపల్లి డాబాకు వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు ముగించుకుని తిరిగి అద్దంకి వెళ్లేందుకు జీపుపై బయల్దేరారు. జీపు మేదరమెట్ల దక్షిణ బైపాస్ సమీపానికి రాగానే అందులో ఉన్న ఆసీఫ్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఆసీఫ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మిగిలిన స్నేహితులు అదే జీపులో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆసీఫ్ మృతి చెందాడు. మృతుడు ఖాజావలి, చాంద్బీ దంపతుల రెండో కుమారుడు. విశాఖపట్నంలో రెండో సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


