సింగరాయకొండ: పాతసింగరాయకొండ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 24వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆలయ ఈఓ పి.కృష్ణవేణి అన్నారు. ఆలయ ఆవరణలో శనివారం దేవస్థాన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధానంగా పోలీసు శాఖ ప్రధానపాత్ర పోషించాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన తాగునీరు, బయో టాయ్లెట్స్, దర్శనం ఏర్పాట్లు సజావుగా జరిగేటట్లు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీఐ పి.శ్రీహరి, తహశీల్దార్ రాజేష్, ఎంపీడీఓ డి.జయమణి, ఎస్సై ఎల్ సుధీర్కుమార్, డాక్టర్ వంశీధర్, డాక్టర్ హజరత్, విద్యుత్శాఖ ఏఈ సాంబశివరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్, ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు, వీఆర్ఓ సింహాద్రి, రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


