న్యూస్రీల్
భగ్నమైన పచ్చ కుట్రలు
డీ లిమిటేషన్ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
విజయమే లక్ష్యంగా అడ్డగోలు విభజనకు అధికార టీడీపీ కుట్రలు
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ మార్పులు చేర్పులు
25 డివిజన్ల నుంచి 45 అభ్యంతరాలు
విభజనపై కోర్టును ఆశ్రయించిన మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, మరికొందరు
విభజన ప్రక్రియకు బ్రేక్ పడటంతో నిరాశలో టీడీపీ, జనసేన
మార్జిన్లోకి దిగితే బూడిదే..
టంగుటూరులో రూ.6.39 కోట్లతో నిర్మించిన సిమెంటు రోడ్డు మార్జిన్లను కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మిస్తున్నారు.
సరిహద్దులు చెరిపేశారు.. డివిజన్లను చెల్లాచెదురు చేసేశారు.. డివిజన్ల ఏర్పాటులో పారదర్శకత లోపించింది. ఒంగోలు నగరంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అంతా అడ్డగోలుగా సాగింది. నిబంధనల ప్రకారం పునర్విభజన ప్రక్రియ సాగితే ఎన్నికల్లో గెలుపు కష్టమని భావించిన కూటమి నేతలు కుట్రలకు తెరతీశారు. అధికారులతో నిబంధనలు గాలికొదిలేసి విభజనకు శ్రీకారం చుట్టారు. అంతా అశాసీ్త్రయంగా సాగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో నగర వాసులతో పాటు తాజామాజీ కార్పొరేటర్లు న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కారు. విచారణ జరిపిన కోర్టు.. ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో దొడ్డిదారిలో విజయం సాధించాలన్న టీడీపీ, జనసేన కుట్రలు భగ్నమయ్యాయి.
నగరపాలక సంస్థలో అధికార పార్టీ విజయమే లక్ష్యంగా జరుగుతున్న పునర్విభజన ప్రక్రియపై మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్ అధికారులకు తన అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ అధికారుల నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం 2027 జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని, అది పూర్తికాకముందే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వలన బీసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2027 జనగణన నిబంధనల ప్రకారం 31.12.2025లోపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని, 1.1.2026 నుంచి 1.4.2027 వరకు జనగణన నేపథ్యంలో మొత్తం ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు స్పష్టంగా తెలియజేసిందని కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ వార్డుల విభజన చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఉన్నత న్యాయస్థానం డీ లిమిటేషన్ ప్రక్రియపై తాత్కాలిక స్టే విధించింది.


