ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారులు, సిబ్బంది వరకూ మొక్కలు నాటారు. ప్రజలంతా మొక్కలు నాటి పెంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. కానీ, క్షేత్రస్థాయిలో వారి పనితీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని రోడ్ల డివైడర్లపై నాటిన మొక్కలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతోంది. నగరపాలక సంస్థ పర్యవేక్షించాల్సిన మొక్కలకే దిక్కు లేకుండా పోయింది. డివైడర్లపై నాటిన మొక్కలకు నీరు పోసి పర్యవేక్షించే వారు లేక ఎండిపోయాయి. ప్రభుత్వం, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని, మొక్కుబడి పనులను వెక్కిరిస్తున్నాయి. వీరందరి నిర్లక్ష్యంతో ప్రభుత్వాల లక్ష్యం నీరుగారిపోయిందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.
– సాక్షి, ఒంగోలు


