బల్లికురవ: ప్రమాదవశాత్తూ అద్దంకి బ్రాంచ్ కెనాల్ (ఏబీసీ)లో పడి ఈత రాక ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం బల్లికురవ మండలంలోని ముక్తేశ్వరం పంచాయతీలో సూరేపల్లి గ్రామ సమీపంలో జరిగింది. సూరేపల్లికి చెందిన రావులపల్లి శ్రీనివాసరావు, రాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు వంశీ (23) గ్రామ సమీపంలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్ పవర్ ప్లాంట్ వద్ద నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ కాలు జారి కాలువలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే చనిపోయి ఉండటంతో బయటకు తీశారు. మృతుడు అవివాహితుడు కాగా, చేతికందివచ్చిన కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


