మార్కాపురం టౌన్: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో కమర్షియల్ కాంప్లెక్సుల సెల్లార్లను పార్కింగ్కు వినియోగించకుండా షాపులకు లీజుకు ఇవ్వడంతో సదరు యజమానులకు మున్సిపల్ అధికారులు గురువారం నోటీసులిచ్చారు. మొత్తం 35 మంది యజమానులకు నోటిసులిచ్చామని, ఐదు సెల్లార్లు సీజ్ చేశామని కమిషనర్ డీవీ నారాయణరావు తెలిపారు. పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను అద్దెకివ్వడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని చెప్పారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో ఈ నెల 18వ తేదీన పలువురు షాపింగ్ కాంప్లెక్స్ యజమానులకు నోటిసులిచ్చామన్నారు. స్పందించకపోవడంతో గురువారం తమ సిబ్బందితో వెళ్లి 5 సెల్లార్లకు సీల్ వేసినట్లు పేర్కొన్నారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన సెల్లార్లను సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి సీల్ వేస్తామని ప్రకటించారు. ఆదివారం సాయంత్రంలోగా కమర్షియల్ సెల్లార్లను ఖాళీ చేసి పార్కింగ్కు కేటాయించాలని స్పష్టం చేశారు.


