గ్రావెల్ తవ్వకాలు జరిపిన పొలం పక్కనే మామిడి తోటలు
వ్యవసాయ భూముల్లో గ్రావెల్ మట్టి తవ్వకాలు
కందుకూరు రూరల్: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఆదాయమే పరమావధిగా అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇష్టం వచ్చినట్లు ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మండలంలోని ఓగూరు రెవెన్యూ పరిధిలో ఉన్న దళితుల భూముల్లో ఇష్టం వచ్చినట్లు గ్రావెల్ మట్టిని తవ్వేస్తున్నారు. ఓగూరు రెవెన్యూలో సర్వే నంబర్ 173లో అసైన్డ్ భూములను దళితులకు గతంలో పట్టాలు ఇచ్చారు. వీటిల్లో కొందరు మామిడి తోటలు సాగు చేయగా, మరికొన్ని భూముల్లో జామాయిల్ సాగు చేశారు. అయితే కొందరు భూములను ఖాళీగా ఉంచుకున్నారు. ఈ పొలాల్లో గ్రావెల్ మట్టి నాణ్యమైంది. దీంతో అధికార పార్టీ నాయకుల కన్ను ఆ భూములపై పడింది. ఖాళీగా ఉన్న దళితుల భూములను ఎకరా ఐదారు లక్షలు చొప్పున టీడీపీ నాయకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలు కూడా కేవలం గ్రావెల్ మట్టిని తోలుకునే ఉద్దశ్యంతోనే కొనుగోలు చేస్తున్నారు. ఐదారు లక్షలు కొనుగోలు చేసిన భూముల్లో గ్రావెల్ మట్టిని తవ్వి లక్షలు ఆదాయం పొందుతున్నారు. గ్రావెల్ మట్టిని అమ్ముకోగా తిరిగి భూమి మిగులుతుంది. ఎవరైనా భూమి అమ్మాలంటే టీడీపీ నాయకులకు తెలియకుండా విక్రయించడానికి లేదు. ఒక లక్ష ఎక్కువైనా పర్వలేదు టీడీపీ నాయకులే భూములు కొనుగోలు చేయాలి. ఇదే టార్గెట్గా దళితుల భూములను మరొకరు కొనుగోలు చేయకుండా టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేసుకొని గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ పరిధిలో సుమారు ఐదు ఎకరాల్లో మట్టిని తవ్వకాలు చేశారు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో మట్టిని పది అడుగుల మేర తవ్వేశారు. దీంతో పక్క పొలాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లోతు ఎక్కువగా తీయడంతో పక్క వర్షాలు పడితే అంచులు విరిగి పడుతున్నాయి. దీంతో పాటు గ్రావెల్ తవ్వకాలు జరిపిన పొలాల నుంచి పై పొలాలకు రైతులు వెళ్లేందుకు దారి కూడా ఇబ్బందిగా మారింది. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు రాకపోకలకు అంతరాయంగా మారింది. వ్యవసాయ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు చేస్తూ టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఆ ప్రాంతాల్లోని పక్క పొలాల రైతులు ఇబ్బందులను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిపై అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ మట్టి తవ్వకాలు ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తుండడంతో తారు రోడ్లు కూడా మట్టి రోడ్లుగా మారుతున్నాయి. రాత్రిల్లో ఎక్కువగా మట్టిని తరలిస్తున్నారు. కందుకూరు ప్రాంతాల్లోని వెంచర్లకు, సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాల్లోకి ఈ మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వ్యవసాయ పొలాల్లో గ్రావెల్ తవ్వకాలను నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు.
దళితుల భూములను తవ్వేస్తున్నటీడీపీ నేతలు
తక్కువ ధరలకు భూమి కొనుగోలు
గ్రావెల్ మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం
10 అడుగుల మేర తవ్వకాలతో పక్క పొలాల రైతులకు ఇబ్బంది
పట్టించుకోని అధికారులు


