ఒంగోలు సిటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకటరెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపినవారిలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఉన్నారు. గాదె వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్ మెరిట్ లిస్టును శుక్రవారం విడుదల చేసినట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ జి.శోభరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఫైనల్ మెరిట్ లిస్టులో క్లరికల్, టైపో గ్రఫికల్ తప్పిదాలు ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టును సీఎఫ్డబ్ల్యూ.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.
● పల్లెనిద్రలో కలెక్టర్కు పీ.గుడిపాడు వాసుల వినతి
మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని పీ.గుడిపాడులో సమస్యలను పరిష్కరించాలని ఆ గ్రామ ప్రజలు కలెక్టర్ పి.రాజాబాబును కోరారు. గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, మండల అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. గ్రామంలో డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని, ఎస్సీ సామాజిక వర్గానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని, గ్రామంలో నిర్వహించిన రీ సర్వే సక్రమంగా జరగలేదని, తిరిగి సర్వే సక్రమంగా చేయాలని అర్జీ రూపంలో కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా దాదాపు 11 ఏళ్ల నుంచి సుబాబుల్ కర్ర నరికే పనిలో వెట్టిచాకిరి చేస్తున్న 10 మందికి కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు పునరావాస కల్పనకి చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జాన్సన్, డీపీవో వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, మండల అధికారులు, యానాది మహా కూటమి రాష్ట్ర కమిటీ సభ్యుడు చేవూరి వెంకటేశ్వర్లు, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు.
అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీని లెక్కించారు. 66 రోజులకు గాను రూ.26,93,686 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఏసీ తిమ్మాయనాయుడు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఏసీ తెలిపారు. అన్నదానానికి రూ.17,195 వచ్చింది. కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మదమంచి తిమ్మానాయుడు, పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావు, సభ్యులు ఏల్చూరి వెంకటనారాయణమ్మ, కోనంకి సుబ్బారావు, ఆకుల కోటేశ్వరమ్మ కోటేశ్వరరావు, ఒంగోలు దేవస్థాన ఇన్స్పెక్టర్ చెన్నారెడ్డి వేణుగోపాలరావు పాల్గొన్నారు.


