పొగాకు రైతుల కోసం పోరాడతాం
కొండపి: పొగాకు రైతులకు మద్దతు ధర లభించేంత వరకూ వారికి అండగా ఉండి పోరాడతామని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. గురువారం కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుతో కలిసి ఆదిమూలపు సురేష్ సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులను నిర్లక్ష్యం చేస్తోందని సురేష్ విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పొగాకు రైతులు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు పొందారని గుర్తుచేశారు. జిల్లాలో పొగాకుతో పాటు కంది, మిరప, శనగ రైతులు ఆయా పంటలకు మద్దతు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ప్రతిపక్షంగా తమ పోరాటాన్ని ఉధృతం చేసి రైతుల పక్షాన నిలబడతామని సురేష్ అన్నారు.
ఆనాటి గడ్డు పరిస్థితులను రైతులు
ఎదుర్కొంటున్నారు : చుండూరి రవిబాబు
2015–16 కాలంలో టీడీపీ ప్రభుత్వంలో పొగాకు రైతులకు మద్దతు ధర లేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఈ సంవత్సరం కూడా అటువంటి గడ్డు పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. 2015–16లో పొగాకు రైతులకు మద్దతు ధర లేక నియోజకవర్గంలో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతులతో పొగాకు కేంద్రాలను ముట్టడిస్తే రైతులపై కేసులు పెట్టిన ఘనత ఆనాటి, ఇప్పటి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. రైతులు మూడు రకాలుగా నష్టపోతున్నారని తెలిపారు. దిగుబడి 30 శాతం తగ్గిందని, ధరలు 30 శాతం తగ్గాయని, 30 శాతం పెట్టుబడి పెరిగిందని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రవిబాబు వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారి తరఫున ఉద్యమం చేయడానికి వైఎస్సార్ సీపీ ముందుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ను, ఏదో ఒక ఏజెన్సీని రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
గోడు వెల్లబోసుకున్న రైతులు...
కొండపి వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆదిమూలపు సురేష్, చుండూరి రవిబాబుతో పొగాకు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెట్లూరుకు చెందిన గుజ్జులు నాగిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ఇంతకన్నా తక్కువ నాణ్యత ఉన్న పొగాకును కేజీ 360 రూపాయలకు కొనుగోలు చేశారని తెలిపారు. దానికన్నా మెరుగైన పొగాకును ఈ సంవత్సరం కేవలం 250 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. దీనివలన తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఇలాంటి ధరల వలన రైతులకు నష్టం వాటిల్లుతోందని, ఏం చేయాలో అర్థంకావడం లేదని, అయోమయమైన పరిస్థితిలో రైతాంగం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులతో పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాకా పిచ్చిరెడ్డి, కొండపి మండల కన్వీనర్ ఆరికట్ల కోటిలింగయ్య, జేసీఎస్ కన్వీనర్ గొట్టిపాటి మురళి, పొగాకు ఉత్పత్తిదారుల కొండపి అధ్యక్షుడు నాగినేని భాస్కర్ చౌదరి, ఉపాధ్యక్షుడు బొక్కిసం సుబ్బారావు, స్టేట్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ రియాజ్, రైతు విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ రామచంద్రరావు, జిల్లా బీసీ సెల్ సెక్రటరీ మాచేపల్లి నాగయ్య, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు పుట్టా వెంకటరావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు షేక్ వన్నూరు, ఇంటలెక్చువల్ అధ్యక్షుడు భువనగిరి సత్యనారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు వసంతరావు, కల్చరల్ వింగ్ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు గంగాధర్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సుల్తాన్, కొండపి జెడ్పీటీసీ మారెడ్డి అరుణ వెంకటాద్రి, మర్రిపూడి జెడ్పీటీసీ సుధారాణి వెంకట్రావు, వైస్ ఎంపీపీ కోటరాజు, నియోజకవర్గ సీనియర్ నాయకులు రావురి ప్రవీణ్, బచ్చల కోటేశ్వరరావు, వేముల రమేష్, మసనం వెంకట్రావు, బోధ రమణారెడ్డి, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, పిన్నిక శ్రీనివాసులు, చింతపల్లి హరి, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, హరినారాయణ, ఇతర నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
మద్దతు ధర దక్కేంత వరకూ అండగా ఉంటాం వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
పొగాకు రైతుల కోసం పోరాడతాం


