
సాక్షి, తాడేపల్లి: రాజకీయాల్లో డ్రామాలు ఆడాలంటే చంద్రబాబును మించినవారు లేరంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే వైఎస్ జగన్ మీద విమర్శలా?. చంద్రబాబు సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వెన్నుపోటు రాజకీయాలు కాదు.. ప్రజలు అధికారం ఇవ్వాలని వైఎస్ జగన్ చెబుతుంటారు.. సిర్థమైన, బలమైన అభిప్రాయం ఉన్న నాయకుడు వైఎస్ జగన్’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల మీద పడి కూటమి నేతలు హింసకు పాల్పడుతున్నారు. హత్యలకు కూడా తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘చంద్రబాబు, మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. హెలికాఫ్టర్ మీదకు వైఎస్సార్సీపీ నేతలు ప్రజలను పంపారా? బాబూ ఇవేం మాటలు?. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, క్యాంప్లు పెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ అభిమాన్యుడు కాదు.. అర్జునుడు లాంటి వాడు మా లీడర్. చంద్రబాబు కుట్రలను చీల్చి చెండాడుతాడు’’ అని పేర్ని నాని చెప్పారు.
‘‘డ్రామాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు. జైల్లో ఉన్నప్పుడు ఎన్ని రకాల డ్రామాలు వేశాడో అందరికీ తెలుసు. ఆయన శరీరంపైన పొక్కులు వచ్చాయనీ, డీహైడ్రేషన్ వచ్చిందనీ, దోమలతో కుట్టించి చంపే ప్రయత్నం చేశారనీ డ్రామాలు ఆడారు. రాజకీయాల్లో డ్రామాలు, నాటకాలు చంద్రబాబుకే చెల్లు. డీసీజీఏ కూటమి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. వారి దగ్గర నుండి హెలికాఫ్టర్ పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చుకదా?. మీడియా ముసుగులో ఈనాడు పాపపు రాతలు రాస్తోంది. రామోజీరావు సంస్మరణ సభకి వచ్చిన జనానికి ఎంత డబ్బులు ఇచ్చి రప్పించారు?. సంస్కారం మరిచి వార్తలు రాయటం ఈనాడుకు అలవాటు
..అధికారం టీడీపీ దగ్గర ఉంది, జనం జగన్ దగ్గర ఉన్నారు. హెలికాఫ్టర్ దగ్గర వరకు జనం వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. 2019 ఎన్నికల సమయానికి కూడా జగన్ ప్రతిపక్ష నేతే. అయినప్పటికీ ఈసీ గట్టిగా పనిచేసినందున జగన్కు భద్రత కల్పించారు. ఇప్పుడు అధికారం తమ చేతిలో ఉన్నందున ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఖాకీల్లో 90 శాతం మంది జాగ్రత్తగానే పని చేస్తున్నారు. మిగతా పది శాతం దిగజారి వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి అనిత హుందాతనం మరిచి ఎకసెక్కాలు చేస్తున్నారు

..పదవులు శాశ్వతం కాదని ఆమెకి త్వరలోనే తెలుస్తుంది. చంద్రబాబు, పవన్, లోకేష్ అనునిత్యం జగన్ నామస్మరణ చేస్తునారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినప్పుడు నిత్యం ఆయన గురించే ఎందుకు కలవరిస్తున్నారు?. ఖాకీ చొక్కా పరువు తీస్తున్న పోలీసులు ఆ ఉద్యోగానికి అనర్హులు. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి పోలీసులు మైక్ ఇచ్చి జనాన్ని కంట్రోల్ చేయించారు. అదే తోపుతుర్తి మీద అక్రమ కేసులు పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులు పెట్టినవారిని ఏం అనాలి?. ఇలాంటి పను వలనే ప్రజల్లో తిరుగుబాటు వస్తోంది. ఇప్పటికే ప్రాణ భయంతో జనం ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. వారికి రక్షణ కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. అలాంటప్పుడు ఇది దిక్కుమాలిన ప్రభుత్వం కాక మరేమిటి?
..టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలికి సిగ్గుఎగ్గూ లేదు. చంద్రబాబూ మీ ఆలోచనాతీరు మార్చుకోండి. సర్పంచ్ స్థాయి లేని వ్యక్తులకు కూడా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించటం చంద్రబాబుకే చెల్లింది. జగన్ ప్రాణాలకు కేంద్రమే రక్షణ కల్పించాలి. కూటమి నేతలకు దుర్మార్గపు ఆలోచనలు పెరిగిపోయాయి. కొల్లి రవీంద్రకు అత్యధిక ఆదాయం వచ్చే శాఖలను కేటాయించారు. ఆయనకు సంచులు మోసే పదవి ఇచ్చారు. కానీ సంచులు కట్ చేసి దోచుకుంటున్నందునే ఆయన ఓఎస్డీని తొలగించారు. త్వరలోనే రవీంద్ర పదవి ఉండటం కూడా ఖాయమే. వీళ్ల అవినీతి, వేధింపులు తట్టుకోలేక ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెలవుపై వెళ్లాడు.
టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతే చంద్రబాబు, పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు గుడులు కూల్చితే జగన్ వాటిని తిరిగి నిర్మించారు. చంద్రబాబు రథాలను తగలపెట్టిస్తే జగన్ దాన్ని పునఃనిర్మాణం చేశారు. రాజకీయాల కోసం దేవుళ్ల తల నరికించితే తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేసింది జగన్. హైందవ ధర్మాన్ని నిలపెట్టింది వైఎస్ జగన్’’ అని పేర్ని నాని తెలిపారు.