సాక్షి, కృష్ణా జిల్లా: ‘‘నేను బియ్యం దొంగతనం చేశానని ఆరోపిస్తున్నారు. మీకు దమ్ముంటే విచారణ జరిపి నన్ను లోపల వేయండి’’ అంటూ మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. 2029 కల్లా చంద్రబాబు సర్కార్ పతనమవ్వడం ఖాయమని.. ఈ లోపు మీకు దమ్ముంటే తనను లోపల వేయండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మచిలీపట్నం నియోజకవర్గం ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై ఇవాళ(గురువారం) అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్న కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని, వరికూటి అశోక్ బాబు, బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏలు), నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, హోంమంత్రి అనితపై మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చినప్పుడు మీకు జ్ఞానం లేదా?. 382 మందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నామని ఇప్పుడు చెబుతున్నారు. నిన్నటి వరకూ 3 శాతం అన్నారు.. ఇప్పుడు 382 మంది అంటున్నారు. ఎంతమందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నారో కూడా చెప్పరా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.
‘‘జీవోను మార్చి 29 ఆటలను 67 ఆటలకు పెంచేశారు. 40వ ఆట కింద పేక ముక్కలతో ఆడే బ్రిడ్జ్ ఆటను పెట్టారు. ఏ ఆటకు ఎవర్ని తీసుకున్నారో 9 నెలలు నుంచి చెప్పడం లేదు. మేం నిరసనలు చేశాం కాబట్టి ఇప్పుడు డేటా బయటపెడుతున్నారు. పేకాట ఆడేవాళ్లను తీసుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు. ఐఏఎస్ సంతకం లేకుండా స్పోర్ట్స్ కోటా లిస్ట్ ఎలా పెట్టారు?. ప్రజల అదృష్టం బాగుండి పేకాట నుంచి టీచర్లను తీసుకోలేదు. బ్యాగులు, సర్టిఫికెట్లు తెస్తే ఆ ఉద్యోగం కూడా ఇచ్చేవాళ్లు. ఆటలు కేంద్రం పెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగతనం రుజువయ్యాక చంద్రబాబు, అనిత మాట్లాడుతున్నారు
..డీఎస్సీ అక్రమాల పై విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరు విప్పడు. లోకేష్ ఏజెంట్ల కింద సీఎం, హోంమంత్రి మాత్రం మాట్లాడేందుకు వస్తారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే హోంమంత్రి మాట్లాడరు. విద్యాశాఖలో తప్పు జరిగిందని మేం అనగానే హోం మంత్రి తెరమీదకు వచ్చేశారు. డీఎస్సీలో మీరు చేసిన పాపాలు మీకు తగలకుండా ఉంటాయా?. చంద్రబాబు గొప్పలు రాష్ట్రానికి అప్పులు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.


