తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసమే.. నిరుద్యోగ దీక్ష: వైఎస్‌ షర్మిల  | YS Sharmila comments over kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసమే.. నిరుద్యోగ దీక్ష: వైఎస్‌ షర్మిల 

Apr 27 2023 3:04 AM | Updated on Apr 27 2023 10:53 AM

YS Sharmila comments over kcr - Sakshi

కవాడిగూడ (హైదరాబాద్‌): నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1,200 మంది విద్యార్థులు బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే సీఎం గద్దెనెక్కిన కేసీఆర్‌ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. అందుకే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. బుధవా రం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద టీ–సేవ్‌ ఆధ్వర్యంలో ష ర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కొట్లాడాలంటే కూడా కోర్టుల నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు. అయినా దీక్ష అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.  వైఎస్‌ఆర్‌ అందించిన పాలన రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలు నోరు మూసుకుని కూర్చుంటే, తాను వారిపక్షాన నిలబడి కొట్లాడుతున్నానని తెలిపారు.

దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ సతీమణిని అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ–సేవ్‌ తరఫున కేసీఆర్‌కు పది ప్రశ్నలు పంపుతున్నామని, దమ్ముంటే వాటికి సమాధానం చెప్పాలని ష ర్మిల సవాల్‌ విసిరారు. విద్యార్థులు రాజకీయ శక్తిగా ఎదిగి పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని గద్దర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ వద్ద ఉద్యమం ఉంది తప్ప డబ్బులు లేవని, ఇప్పుడు మాత్రం డబ్బులే మిగిలాయని పేర్కొన్నారు. దీక్షలో ప్రొఫెసర్‌ కాశీం, వైఎస్‌ఆర్‌టీపీ ప్రతినిధులు  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement